
మన ఊరు-మాటామంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
రావివలస ప్రగతికి రూ.15 కోట్లు మంజూరు
పంచాయతీ ప్రజలతో వర్చువల్గా సమావేశం
టెక్కలి, టెక్కలి పట్టణం, న్యూస్టుడే: ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే నిధులొక్కటే సరిపోవని, ప్రజలందరి ఐక్యత, భాగస్వామ్యం, చొరవ అవసరమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఊరు అభివృద్ధి చెందాలంటే ప్రతి అంశాన్నీ మనదిగా భావించాలని, 'మన ఊరు-మాటామంతి’ కార్యక్రమం ఉద్దేశం అదేనని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి భవానీ థియేటర్ వేదికగా గురువారం మన ఊరు- మాటామంతి కార్యక్రమం ఆత్మీయంగా సాగింది. టెక్కలి మండలం రావివలస పంచాయతీ గ్రామస్థులను టెక్కలిలోని భవానీ థియేటర్కు పిలిపించి, అక్కడ
కూర్చోబెట్టగా.. పవన్ కల్యాణ్ అమరావతి నుంచి వారితో వర్చువల్గా మాట్లాడారు. పెద్ద తెరపై పవన్ కనపడుతూ మాట్లాడుతుంటే, గ్రామస్థులు మైకులో మాట్లాడారు. ఇదంతా వారికి ఒక విభిన్న
అనుభవంగా మిగిలింది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "పార్టీలకతీతంగా గ్రామాల్లో ఐక్యంగా ఉండాలి. పిల్లలు సెల్ఫోన్లు చూసుకోకుండా, టీవీలకు అతుక్కోకుండా ఆడుకునేలా చూడాలి. వారికి దేహదారుఢ్యం చాలా అవసరం. ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలవాలి. పారిశుద్ధ్యంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఊరి నుంచి ఉన్నతస్థాయికి వెళ్లినవారు ఊరికి కొంత కేటాయించాలి. ముఖ్యమంత్రి ఆలోచన కూడా అదే" అని తెలిపారు. గ్రామస్థులు చెప్పిన సమస్యలు విని, పరిష్కారానికి రూ.15 కోట్లు మంజూరు చేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్ఎల్ నాయుడు మాట్లాడుతూ, రావివలస ఎండల మల్లన్న ఆలయానికి వెళ్లే రహదారులు ఇరుగ్గా ఉన్నాయని, పంచాయతీలో కాలువల వ్యవస్థ లేదని.. రావివలస, దామోదరపురం గ్రామాల్లో శ్మశానవాటికలకు రహదారులు లేవని చెప్పారు.